కొత్త ఏడాది వేడుకలకు ఆఫర్లు సిగ్గుచేటు

ABN , First Publish Date - 2021-12-30T07:52:16+05:30 IST

గుతున్నాయని

కొత్త ఏడాది వేడుకలకు ఆఫర్లు సిగ్గుచేటు

  • ఉద్యోగులపై కక్ష కట్టారు  
  • జీవో 317పై పునఃసమీక్షించాలి: సంజయ్‌

కాగజ్‌నగర్‌, డిసెంబరు 29: నిరుద్యోగుల కోసం తాము దీక్ష చేయగా.. ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని ప్రత్యేక జీవోలు జారీ చేసి ఆంక్షలు విధించారని, కానీ కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రభుత్వం బార్లకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మివర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తుగ్లక్‌ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అధైర్యపడొద్దని, ముడి బియ్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఉప్పుడు బియ్యం మాత్రం సేకరించబోమని ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రానికి లేఖ పంపినట్లు తెలిపారు.


కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 317తో రాష్ట్రంలోని ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికత స్పష్టతతోనే తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష కట్టి వేధిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులైన భార్యాభర్తల బదిలీల విషయంలో స్పష్టత లేదన్నారు. జీవో 317పై వెంటనే పునఃసమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. ఒమైక్రాన్‌ను అదుపులోకి తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ పెడితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం డిసెంబర్‌ 31న మద్యం దుకాణాలు, బార్‌ల వేళలను పొడిగించి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి విమర్శించారు. కరోనా నిబంధనల కంటే మద్యం ఆదాయమే ఈ ప్రభుత్వానికి ముఖ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని.. వాటిని ప్రభుత్వం మరింత పెంచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 



Updated Date - 2021-12-30T07:52:16+05:30 IST