చల్లా కాదు.. చిల్లర ధర్మారెడ్డి
ABN , First Publish Date - 2021-02-06T06:33:19+05:30 IST
‘‘పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాదు.. చిల్లర ధర్మారెడ్డి... ఆయనపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా, ఇందిరాపార్క్ వద్ద దీక్ష, ఆ తర్వాత చలో పరకాల కార్యక్రమాలు చేపడతాం’’ అని అఖిల పక్ష నేతలు హెచ్చరించారు.

24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు
రౌండ్టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతల హెచ్చరిక
పంజాగుట్ట/హన్మకొండ రూరల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాదు.. చిల్లర ధర్మారెడ్డి... ఆయనపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా, ఇందిరాపార్క్ వద్ద దీక్ష, ఆ తర్వాత చలో పరకాల కార్యక్రమాలు చేపడతాం’’ అని అఖిల పక్ష నేతలు హెచ్చరించారు. ‘‘బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే ఊరుకోము’’ పేరిట మాజీ ఎంపీ వి.హనుమంతరావు అధ్యక్షతన శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అ సెంబ్లీ స్పీకర్ను కలిసి వినతి పత్రం ఇస్తామని, సీఎంనూ కలుస్తామని అయినా స్పందించకపోతే పోరాటం ప్రారంభిస్తామని వీహెచ్ అన్నారు. ధర్మారెడ్డి కుల దురహంకారంతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ గౌడ్ చెప్పారు. ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: బహుజన సంఘాలు
ధర్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సౌతిండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్తో పాటు పలువురు బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు.