ఉత్తరాది అంబానీకి.. దక్షిణాది అదానీకి!
ABN , First Publish Date - 2021-03-17T07:37:30+05:30 IST
కొత్త రైతు చట్టాలను తీసుకొచ్చేముందు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు అంబానీ, అదానీలను మాత్రమే సంప్రదించారని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మేగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఆరోపించారు.
- సాగు చట్టాలపై వారిని మాత్రమే సంప్రదించారు
- కావాలనే కరోనా సమయంలో ఆర్డినెన్స్ తెచ్చారు
- సభలో బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు నుంచే
- మధ్యప్రదేశ్లో 400 కార్పొరేట్ గోదాముల నిర్మాణం
- దేశంలో చాలామందికి వ్యవసాయ మంత్రి పేరే తెలియదు
- స్వామినాథన్ కమిటీ సిఫారసులపై ప్రత్యేక సెషన్ పెట్టాలి
- ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ డిమాండ్
ఖమ్మం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కొత్త రైతు చట్టాలను తీసుకొచ్చేముందు కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలు అంబానీ, అదానీలను మాత్రమే సంప్రదించారని ప్రముఖ జర్నలిస్టు, రామన్ మేగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఆరోపించారు. ఉత్తర భారతాన్ని అంబానీకి, దక్షిణ భారతాన్ని అదానికి అప్పగించే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే కొండపల్లి లక్ష్మీ నర్సింహారావు పదో వర్ధంతి సందర్భంగా మంగళవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ‘వ్యవసాయరంగం- రైతు చట్టాలు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చేముందు రాష్ట్రాలనుగానీ, అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీనిగానీ సంప్రదించలేదని ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని నిపుణుల కమిటీకి రిఫర్ చేయాలని ఎంపీలంతా సూచించినా.. ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు చట్టాలను రాస్తున్నాయని ఆరోపించారు. బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు నుంచే మధ్యప్రదేశ్లో కార్పొరేట్ కంపెనీలు 400 గోదాములు నిర్మించాయని ఆరోపించారు. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించాయని.. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రజారోగ్యం గురించి పట్టించుకోకుండా ఇతర ప్రయోజనాలను ఆశించి ఈ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు.
కరోనా సమయంలో అయితే రైతులు బయటకొచ్చి ఉద్యమాలు చేయలేరన్న ఉద్దేశంతోనే ఆ సమయంలో చట్టాలను తీసుకొచ్చిందన్నారు. కానీ రైతులు మాత్రం 110 రోజులుగా దేశంలోని ప్రజలందరి కోసం పోరాడుతున్నారన్నారు. నూతన సాగు చట్టాలతో న్యాయవ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. తమకు నష్టం జరిగినప్పుడు రైతులు కోర్టుకు వెళ్లే అవకాశం రైతులకు లేకుండా పోతోందని ఆవేదన వెలిబుచ్చారు. దేశంలో చాలామందికి వ్యవసాయమంత్రి పేరే తెలియదన్నారు. రైతు చట్టాలపై కేవలం పంజాబ్, హరియాణాలోనే ఉద్యమం జరుగుతోందని అంటున్నారని, అవి దేశంలోనే ఉన్నాయి కానీ పాకిస్థాన్లో లేవు కదా అని సాయినాథ్ ప్రశ్నించారు. రాష్ట్రాలలో మండీలు, ఏపీఎంసీలు ఈ చట్టాల ద్వారా నాశనం అవుతాయని.. ఫలితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు ప్రైవేటు కార్పొరేట్ వ్యాపారుల నుంచి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు.
తాము అధికారంలోకి వస్తే.. స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఏడాదిలోపు అమలు చేస్తామని బీజేపీ తన 2014 మేనిఫెస్టోలో ప్రకటించిందని సాయినాథ్ గుర్తుచేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయలేమంటూ కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందని, ఇక రైతులు మోదీని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర ఉండాలని.. తక్షణమే కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవస్థల కోసం తీసుకోచ్చిన జీఎస్టీకి సంబంధించి నాలుగు రోజులపాటు స్పెషల్ సెషన్స్ పెట్టినట్టుగానే.. రైతుల కోసం స్వామినాథన్ కమిటీ సిఫారసులపై చర్చించేందుకు కనీసం ఒక్కరోజైనా పార్లమెంటులో ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. సాగు చట్టాలపై 110 రోజులుగా జరుగుతున్న పోరాటాన్ని ప్రజలు గమనించాలని, స్వాతంత్య్ర, సాయుధ పోరాటం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ప్రస్తుత రైతు ఉద్యమం సాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్ నరసింహారావు భార్య కొండపల్లి దుర్గాదేవి, కుమారులు ఉత్తమ్, పవన్కుమార్, కుటుంబసభ్యులతో పాటు పలువురు సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
