ఆంక్షలు అక్కర్లేదు!
ABN , First Publish Date - 2021-12-25T07:00:56+05:30 IST
ఒమైక్రాన్ వేరియంట్తో ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని
![ఆంక్షలు అక్కర్లేదు!](https://media.andhrajyothy.com/appimg/galleries/1921122501225986/12252021013003n85.jpg)
- ఇప్పటికిప్పుడు ఒమైక్రాన్తో ముప్పేమీ లేదు
- రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి లేదు.. కేంద్రం మార్గదర్శకాల మేరకే ఆంక్షలు
- హైకోర్టు సూచనలపై సర్కారు తర్జనభర్జన.. తాజా పరిస్థితిని నివేదించాలని యోచన
హైదరాబాద్, డిసెంబరు 24 (ఆంఽధ్రజ్యోతి): ఒమైక్రాన్ వేరియంట్తో ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని, రాష్ట్రంలో ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఒమైక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఆంక్షలు విధించాలని సర్కార్కు హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగ సందర్భంగా జనం గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. అయితే, తెలంగాణలో ఆంక్షలు విఽధించాల్సినంత తీవ్రత లేదని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వైరస్ పాజిటివిటీ రేటు 10శాతానికి మించినప్పుడు, ఆస్పత్రుల్లో 40 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడే ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. కానీ, తెలంగాణలో ఇలాంటి పరిస్థితులేమీ లేవు. రెండు రోజులుగా ఒక్క ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.46 శాతమే ఉండగా, వ్యాప్తిరేటు అనుకున్నంత వేగంగా ఏమీ లేదు. తప్పని సరిగా మాస్కులు పెట్టుకోవాలని, గుంపులుగా ఉండకూడదని ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలతోపాటు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను కోర్టుకు నివేదించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఆంక్షలు పెడితే ప్రజలు భయాందోళనలకు గురవుతారన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.
రాత్రిపూట కర్ఫ్యూతో పెద్దగా ఉపయోగం ఉండదని, రోజూవారీ దైనందిక వ్యవహారాలకు ఇబ్బంది కలుగుతుందని, ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయని భావిస్తోంది. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే వెనువెంటనే ఆంక్షలు విధించడంతోపాటు కర్ఫ్యూ వంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్యవర్గాలు వెల్లడించాయి. కరోనా మూడో వేవ్ వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఒమైక్రాన్ కట్టడికి ముందస్తు ప్రణాళికలు చేపట్టినట్లు ఆరోగ్యశాఖ మంత్రి హరీ్షరావు తెలిపారు.
మరోవైపు, వైద్య నిపుణుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒమైక్రాన్ చాలా వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ఆంక్షలు విధించాలని కొందరు వాదిస్తున్నారు. ఆంక్షలు విధించాల్సి వస్తే తొలుత అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయాలని అభిప్రాయపడుతున్నారు.