నిలోఫర్‌ హెడ్‌ నర్సు మృతి

ABN , First Publish Date - 2021-05-08T08:03:21+05:30 IST

కరోనా బారినపడి హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి హెడ్‌ నర్సు కె.స్వరూప రాణి (53) మృతిచెందారు.

నిలోఫర్‌ హెడ్‌ నర్సు మృతి

మంగళ్‌హాట్‌, మే 7(ఆంధ్రజ్యోతి): కరోనా బారినపడి హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి హెడ్‌ నర్సు కె.స్వరూప రాణి (53) మృతిచెందారు. గత నెల 28న ఈమెకు పాజిటివ్‌ వచ్చింది. మాసబ్‌ట్యాంక్‌లోని మహవీర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. టోలిచౌకికి చెందిన స్వరూప రాణి నిలోఫర్‌ ఆస్పత్రిలో 1990లో నర్సుగా చేరారు. 2016లో హెడ్‌ నర్సుగా పదోన్నతి పొందారు. కాగా, నిలోఫర్‌ ఆస్పత్రిలో పెద్దఎత్తున వైద్య సిబ్బంది వైర్‌సకు గురవుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో మొత్తం 58 మందికి కొవిడ్‌ సోకింది. వీరిలో 15 మంది వైద్యులు, 18 మంది స్టాఫ్‌ నర్సులు, 25 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. కొందరు ఆస్పత్రుల్లో, మరికొందరు ఐసోలేషన్‌లో ఉన్నారు. తమను సహచర ఉద్యోగులు తప్ప అధికారులు పట్టించుకోవడం లేదని వీరంతా ఆరోపిస్తున్నారు. నిలోఫర్‌లోనే వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక పాజిటివ్‌ వచ్చిన సెక్యూరిటీ, పారిశుద్ధ్య, పేషెంట్‌ కేర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇళ్లలో ఉండలేక, ఆస్పత్రుల్లో చేరలేక ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2021-05-08T08:03:21+05:30 IST