బియ్యం కొనుగోలుపై గళమెత్తుతాం
ABN , First Publish Date - 2021-11-29T08:40:05+05:30 IST
తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చేసే అంశంపై పార్లమెంట్లో గళమెత్తుతామని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
- కేంద్రం సమాధానం చెప్పాల్సిందే: ఎంపీ నామా
న్యూఢిల్లీ/ఖమ్మం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలు చేసే అంశంపై పార్లమెంట్లో గళమెత్తుతామని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు నామా, బండా ప్రకాశ్ పాల్గొన్నారు. అనంతరం నామా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో పండించిన పంట మొత్తం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. ఈ అంశంపై కేంద్రంతో నాలుగైదు సార్లు చర్చలు జరిగాయని, కానీ పంటను కొనబోమన్న విధంగా కేంద్రం మాట్లాడిందని పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చించాలని, కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు స్పష్టం చేశామని వెల్లడించారు.
కొత్త రైతు చట్టాల రద్దు బిల్లులతో పాటు పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడంపై చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. విద్యుత్తు బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలను సభలో లేవనెత్తుతామని వెల్లడించారు.