ప్రమాదానికి గురైన బాలుడి చికిత్స బాధ్యత నాదే : మైనంపల్లి
ABN , First Publish Date - 2021-04-12T13:26:49+05:30 IST
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి ప్రమాదానికి గురై సైనిక్పురిలోని
హైదరాబాద్/మౌలాలి : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి ప్రమాదానికి గురై సైనిక్పురిలోని అంకూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మౌలాలి డివిజన్ ఈస్ట్ మారుతీనగర్కు చెందిన నిషాంత్ (8) పరిస్థితిని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన మంత్రి.. నిషాంత్ను జాగ్రత్తగా చూసుకుంటాం అంటూ పోస్టు చేశారు. దీంతో నిషాంత్ కుటుంబ సభ్యులు, మల్కాజిగిరి వాసులు హర్షం వ్యక్తంచేశారు.
బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
చికిత్స పొందుతున్న నిషాంత్ను ఆదివారం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రి బిల్లులు తామే చెల్లిస్తామని వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడవద్దని ఎమ్మెల్యే బాలుడి తల్లికి సూచించారు. ఆయన వెంట ఈస్ట్ ఆనంద్బాగ్ కార్పొరేటర్ ప్రేమ్కుమార్, నక్క ప్రభాకర్గౌడ్, గుండా నిరంజన్, భాగ్యనంద్, సంతోష్, పద్మజారెడ్డి పాల్గొన్నారు.
తల్లిని ఓదార్చిన కార్పొరేటర్
బాలుడి తల్లిని స్థానిక కార్పొరేటర్ గున్నాల సునీతా యాదవ్ కలిసి ఓదార్చారు. చిన్నారి త్వరలో కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం ఆర్థిక సాయం చెక్కు రూపంలో అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.