నా తల్లిదండ్రులూ క్యాన్సర్ బాధితులే
ABN , First Publish Date - 2021-12-05T08:50:56+05:30 IST
‘‘క్యాన్సర్ బాధిత కుటుంబాల కష్టాలు నాకు తెలుసు. మా అమ్మా, నాన్న కూడా కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు’’ అని మంత్రి హరీశ్రావు చెప్పారు.
- ఆ కుటుంబాల కష్టాలు నాకు తెలుసు: హరీశ్
- గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్కు నెల జీతం విరాళం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘క్యాన్సర్ బాధిత కుటుంబాల కష్టాలు నాకు తెలుసు. మా అమ్మా, నాన్న కూడా కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు’’ అని మంత్రి హరీశ్రావు చెప్పారు. మాదాపూర్లోని దసపల్లా హోటల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చు కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయన్నారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు రానున్న రెండేళ్లలో రూ. 10వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మూత్రపిండాలు, కాలేయం ఇతర సమస్యలున్న వారి చికిత్స కోసం వరంగల్లో ఒకటి, నగరంలో నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
జేఎంజే క్యాన్సర్ ఆస్పత్రిని రూ.120 కోట్లతో 450 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. తొలిదశలోనే పరీక్షల ద్వారా క్యాన్సర్ను గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు. కరోనాకు వ్యాక్సిన్ను తయారు చేసిన విధంగా క్యాన్సర్కు కూడా టీకా తయారు చేసేందుకు వైద్యులు, సైంటిస్టులు కృషి చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు తోడు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలన్నారు. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఫౌండేషన్కు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సీఈవో డాక్టర్ చిన్నబాబు సుంకరవల్లి తదితరులు పాల్గొన్నారు.