వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాల పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-03-24T21:19:10+05:30 IST
వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి వెంటనే పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో

న్యూఢిల్లీ: వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి వెంటనే పూర్తి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , బండ ప్రకాష్ , మాలోత్ కవిత తో కలిసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం అందచేశారు. ఇంతకు పూర్వమే ఎంఎల్సీ శ్రీనివాస్ రెడ్డి కేంద్ర మంత్రికి లేఖకూడా రాశారు. కాకతీయుల కళలకు కాణాచిగా ప్రసిద్ధి గాంచిన చారిత్రక ఆలయాలు వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లో చేపట్టిన సమగ్ర అభివృద్ధి, పునరుద్ధరణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా వారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కికు విన్నవించారు.
రాజవంశం కాకతీయులు తమ అప్పటి రాజధాని, ఇప్పటి వరంగల్ జిల్లా కేంద్రం వరంగల్ నడిబొడ్డున వెయ్యి స్తంభాల గుడి కట్టించారన్నారు. స్వర్ణయుగంగా పేరుగాంచిన కాకతీయులు అత్యంత్తమంగా నిర్మించిన దేవాలయాల్లో ఒకటిగా పరిగణ పొందింది. ఈ ఆలయంలోని నక్షత్ర ఆకారంలో వాస్తుశిల్పం అద్భుతమైన హస్త కళాకారుల నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నది. ఆలయానికి చెక్కిన రాతి స్తంభాలు ఆనాటి కళా వైభవాన్ని నేటికీ చాటుతూ ఉన్నాయని వారు వినతిపత్రంలో తెలిపారు.చారిత్రక ఆధారాల ప్రకారం, కాకతీయ రాజు రుద్రదేవుడి ఆదేశాల మేరకు క్రీ.శ 1175–1324 మధ్య వెయ్యి స్తంభాల ఆలయం నిర్మించబడింది. కళాఖండంగా ఉన్న ఈ ఆలోయాన్ని విష్ణు, శివుడు, సూర్య హిందూ దేవతలకు అంకితం చేయబడినదిగా చెబుతారు. శాండ్ బాక్స్ పద్ధతిని ఉపయోగించి 1000 స్తంభాల ఆలయ పునాదులు వేశారు.
ఈ కళా వైశిష్ట్యం కాకతీయ యుగపు శిల్ప చాతుర్యానికి మచ్చు తునక. అన్నారు. 800 సంవత్సరాలకు పైగా ఆలయం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ, ఒకటి రెండు స్తంభాలు ఒరిగాయన్న కారణంగా, ఆలయానికి దక్షిణాన ఉన్న ‘నాట్య మండపం’ పునర్నిర్మాణం కోసం 2005 లో భారత పురావస్తు శాఖ ఉన్న దేవాలయ స్తంభాలను తొలగించివేసింది. అయితే, పునరుద్ధరణ పనులు నిరుత్సాహంగా నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇది 18 నెలల్లోపు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఒక దశాబ్దం గడిచినా ఇంకా పూర్తి కాలేదు. దీన్ని వెంటనే పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు.