మినుములు సాగుచేస్తే కొనుగోలు చేస్తాం
ABN , First Publish Date - 2021-10-23T08:15:49+05:30 IST
యాసంగి సీజన్లో రైతుల మినుములు విరివిగా సాగుచేయాలని, వాటిని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుచేయిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రకటించారు. మార్క్ఫెడ్ భవన్లో శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో..
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్లో రైతుల మినుములు విరివిగా సాగుచేయాలని, వాటిని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుచేయిస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రకటించారు. మార్క్ఫెడ్ భవన్లో శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మినుములకు ధరను క్వింటాలుకు రూ. 6,300గా నిర్ణయించిందని, నాఫెడ్ మినుముల కొనుగోలుకు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మినప పప్పు కొరత తీవ్రంగా ఉందని ఈ దశలో మినుములు సాగుచేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. దీంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు పంటలు సాగుచేయాలని నిరంజన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంపెనీలకు కేటాయించిన జిల్లాల్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టినపుడే రైతులకు నమ్మకం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్పామ్ సాగుచేయించాలని నిర్ణయించిన నేపథ్యంలో కంపెనీలు నర్సరీల్లో మొక్కలు పెంపకం ప్రారంభించాలని సూచించారు. రైతులకు ఆయిల్పామ్ సాగుపై డాక్యుమెంటరీ రూపొందించాలని ఆయిల్ ఫెడ్ ఎండీని ఆదేశించారు.