యాదాద్రి ఆలయానికి ‘మేడ్చల్‌’ విరాళం రూ.1.83 కోట్లు

ABN , First Publish Date - 2021-10-29T08:30:50+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారుతాపడం కోసం మేడ్చల్‌ నియోజకవర్గంలో సేకరించిన రూ.1.83 కోట్ల విరాళాలను మంత్రి మల్లారెడ్డి గురువారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు.

యాదాద్రి ఆలయానికి ‘మేడ్చల్‌’ విరాళం రూ.1.83 కోట్లు

  • యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డికి విరాళం అందజేస్తున్న మల్లారెడ్డి
  • సేకరించిన నగదును ఈవోకు అందజేసిన మంత్రి మల్లారెడ్డి


యాదాద్రి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురం బంగారుతాపడం కోసం మేడ్చల్‌ నియోజకవర్గంలో సేకరించిన రూ.1.83 కోట్ల విరాళాలను మంత్రి మల్లారెడ్డి గురువారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. కుటుంబ సభ్యులతోపాటు నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు దాదాపు 200కుపైగా వాహనాల్లో మేడ్చల్‌ నుంచి యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. బాలాలయ కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులు, ప్రతిష్ఠా అలంకారమూర్తుల చెంత విరాళం నగదు, చెక్కులను పెట్టి ప్రత్యేకపూజలు చేశారు. జేఎస్సార్‌ సన్‌సిటీ ఎండీ జడవెల్లి నారాయణ రూ.50 లక్షల విరాళాన్ని డీడీ రూపంలో దేవస్థాన ఈవోకి అందజేశారు. మంత్రి పర్యటన సందర్భంగా కొండపైకి భక్తుల వాహనాలను అధికారులు అనుమతించలేదు. సుమారు గంటకుపైగా బాలాలయ కవచమూర్తుల దర్శనాలను నిలిపివేశారు. స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవాన్ని ముందుగానే ముగించగా, మఽధ్యాహ్నం నివేదనను ఆలస్యంగా నిర్వహించారు.  నిబంధనలకు విరుద్దంగా మంత్రి అనుయాయులు  బాలాలయంలో ఫొటోలు, సెల్ఫీలతో హడావుడి చేశారు. అనుమతి లేకుండా డ్రోన్‌కెమెరాను తిప్పడం వివాదాస్పదమైంది. 

Updated Date - 2021-10-29T08:30:50+05:30 IST