ఎస్సీ గురుకులాలకు దేశ వ్యాప్త ప్రతిష్ట: మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2021-12-16T00:46:08+05:30 IST

తెలంగాణలో నిర్వహిస్తున్న ఎస్సీ గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని,ఇతర రాష్ట్రాలకు ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

ఎస్సీ గురుకులాలకు దేశ వ్యాప్త ప్రతిష్ట: మంత్రి కొప్పుల

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహిస్తున్న ఎస్సీ గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని,ఇతర రాష్ట్రాలకు ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.పేదలు,నిరుపేదలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బుధవారం జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆలోచన, సంకల్పానికి అనుగుణంగా వీటిని మరింత గొప్పగా నిర్వహించడం, ఫలితాలు సాధించేందుకు మనమందరం బాధ్యతాయుతంగా ముందుకు సాగుదామన్నారు.


ఇందుకు గాను అధికారులు పాఠశాలలను తరచూ సందర్శించాలని,హాజరు,తరగతుల నిర్వహణ,పరీక్షలు,ఫలితాలు,విజయాలపై మాత్రమే దృష్టి సారించాలని మంత్రి ఈశ్వర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఎస్సీ గురుకులాల సంస్ధల కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఈ సందర్భంగా గురుకులాల నిర్వహణ, పురోగతి, సాధించిన ఫలితాలు,విజయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.నర్సింగ్, ఇంజనీరింగ్,బాలుర కోసం 15డిగ్రీ  కాలేజీల ఏర్పాటు ప్రతిపాదన గురించి తెల్పగా మంత్రి కొప్పుల వెంటనే  స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.వివిధ పోటీ పరీక్షలు,క్రీడలు అత్యుత్తమ ఫలితాలు సాధించిన,ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించే సభను త్వరలో ఘనంగా జరుపుకుందామని మంత్రి ఈశ్వర్ చెప్పారు.

Updated Date - 2021-12-16T00:46:08+05:30 IST