బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-12-02T20:26:49+05:30 IST
బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు.
నిర్మల్: బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు.జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో రైతులు వరి ధాన్యం పండించ వద్దని విజ్ఞప్తి చేశారు.వరికి బదులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను వేయాలని సూచించారు. ఓ వైపున యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం వరి ధాన్యం కోనుగోలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోపథకాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని,ఆయన చెప్పే మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.బీజేపీ రైతు వ్యతిరేఖ ప్రభుత్వమని, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సాగు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. నూతన వ్యవసాయిక చట్టాలకు వ్యతిరేఖంగా ఉద్యమించిన 750 మది రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు. సాగు చట్టాల రద్దుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేసినా చర్చ జరపకుండానే నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమోదం తెలిపారని అన్నారు.
సాగు చట్టాలను నిరసిస్తూ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి రూ.మూడు లక్షల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారన్నారు. 750 మంది రైతు కుటుంబాలకు రూ.22.50 కోట్లు అందజేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.