నిరంతరంగా హరితహారం:నిధుల కొరత లేదు: ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-10-04T23:18:17+05:30 IST
హరితహార కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: హరితహార కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన విధానానికి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శాసన మండలిలో సోమవారం హరితహారంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించడానికి తెలంగాణ హరిత నిధి (తెలంగాణ గ్రీన్ఫండ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారన్నారు.
చెట్లు పెంచడానికి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తకుండా, ప్రజలకు పచ్చదనంపై అవగాహన పెరిగేలా సీఎం కేసీఆర్ హరిత నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు.హరితహార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఏడవ విడతలో హరితహార లక్ష్యాన్ని దాటామన్నారు. ఇప్పటివరకు 239.87 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. ఏటా కోట్లల్లో మొక్కలు నాటుతుండటంతో రాష్ట్రంలో పచ్చదనం క్రమంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. హరితహార కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు అంటే 2014-15వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు రూ. 6555.97 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.