హుజూరాబాద్ ఎన్నికను..బీజేపీ, టీఆర్ఎస్ పాలనకు రిఫరెండంగా తీసుకుందామా?
ABN , First Publish Date - 2021-10-17T08:38:20+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నికను ఏడేళ్ల బీజేపీ పాలనకు, టీఆర్ఎస్ పాలనకు రిఫరెండంగా తీసుకుందామా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు..
ఈటలకు మంత్రి హరీశ్రావు సవాలు
హుజూరాబాద్, అక్టోబరు 16: హుజూరాబాద్ ఉప ఎన్నికను ఏడేళ్ల బీజేపీ పాలనకు, టీఆర్ఎస్ పాలనకు రిఫరెండంగా తీసుకుందామా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై రూ.291 పన్ను వేస్తోందని రాజేందర్ మాట్లాడారని, దీనిపై హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద చర్చకు రమ్మని చెప్పి రెండు రోజులైందని, అయినా స్పందించలేదని అన్నారు. ఈటల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే జీఎస్టీ వచ్చిందని, సిలిండర్పై పన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని పేర్కొన్నారు. కేంద్రం పది రోజుల్లో ఏడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాజేందరన్న బీజేపీ అనే బురద గుంతలో దిగారు.. ఆయనకు బురద అంటకుండా ఉంటుందా..? ఓ ఆటో డ్రైవర్ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కారు గుద్దిందంటూ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కానీ, ఆ కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడి కుమారుడిది అని తేలింది.’’ అని హరీశ్ అన్నారు. బీజేపీని ఈటల, ఈటలను బీజేపీ సొంతం చేసుకోవడం లేదని హరీశ్ అన్నారు. ‘‘ఈటల తన ప్రసంగాల్లో ఎక్కడా జై భారత్ మాత, జై శ్రీరాం అనడం లేదు. టీఆర్ఎస్ రైతులను కారు ఎక్కించాలని అనుకుంటోంది. బీజేపీ నాయకులు రైతుల పైకి కారెక్కిస్తున్నారు. దీనిపై హుజూరాబాద్లోని 60 వేల మంది రైతులు ఆలోచించాలి’’ అని కోరారు.