బండి సంజయ్పై ఎర్రబెల్లి ఫైర్.. ప్రశ్నల వర్షం...
ABN , First Publish Date - 2021-04-17T18:21:49+05:30 IST
వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం హాస్యాస్పదమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ : వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం హాస్యాస్పదమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. శనివారం నాడు వరంగల్లో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం, బండిపై ఫైర్ అయ్యారు. వరంగల్ పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘ తెలంగాణలో తీవ్ర వరదలతో నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు కేంద్రం నుంచి ఏం సాయం అందింది..?. తెలంగాణాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చావ్..?. విభజన చట్టం కింద వరంగల్ కోచ్ వ్యాగన్ ఇస్తానని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయే. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఒప్పుకున్న వాటాలను ఇస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలకు న్యాయమైన వాటాలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు..?’ అని అటు కేంద్రంపై.. ఇటు బండిపై ఎర్రబెల్లి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇంతకీ బండి ఏమన్నారు..!?
గ్రేటర్ వరంగల్లో కాషాయ జెండా ఎగరబోతోందని శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్కు మున్సిపల్ ఎన్నికలంటే భయం పట్టుకుందని విమర్శించారు. వరంగల్లో వరదలు వస్తే బీజేపీ ఆదుకుందని.. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూ కబ్జాలు పెరిగాయని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని బీజేపీ ఎక్కడా చెప్పలేదన్నారు. వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలవాలని బండి సంజయ్ తెలిపారు. బండి వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఎర్రబెల్లి పై విధంగా కౌంటరిచ్చారు.