కుమ్మర వృత్తిదారులను ఆదుకోవాలి: మంత్రి ఎర్రబెల్లిని కలిసిన నేతలు
ABN , First Publish Date - 2021-04-11T22:06:23+05:30 IST
రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ఇతర వృత్తులను ఆదుకుంటున్నవిధంగానే, కుమ్మర వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర కుమ్మర సంఘం ప్రతినిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు.
హన్మకొండ: రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ఇతర వృత్తులను ఆదుకుంటున్నవిధంగానే, కుమ్మర వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర కుమ్మర సంఘం ప్రతినిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రిని కలిసి పలువురు నేతలు, పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. కుమ్మర వృత్తి దారులకు ప్రతి జిల్లా కేంద్రంలో ఓ వృత్తి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జిల్లాకు ఒక కుమ్మర సంఘ భవనం ఇవ్వాలని వారు కోరారు. జనగామలో కుమ్మరకులకు కేటాయించిన 4 ఎకరాల స్థలాన్ని వారికే ఉండే విధంగా చూడాలని చెప్పారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 20వేలు డిపాజిట్ చేస్తే, 2లక్షల రూపాయల లోన్ ఇస్తామన్నానని, ఆ లోన్లు అందే విధంగా చూడాలని వారు మంత్రిని కోరారు.
సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఆయా సమస్యలను పరిష్కరించేకుందుకు కృషి చేస్తామని మంత్రి వారికి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏదునూరి రాజమౌళి, ఆవునూరి రామన్న, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఓదెల చందర్ రావు, ఆవునూరి ఆనందం, జనగామ అధ్యక్షుడు వెలిశాల అశోక్, కార్యదర్శి నిడిగొండ రాజు, వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఆవునూరి అనిల్, ఓరుగంటి చరణ్ రాజు తదితరులు ఉన్నారు.