పిచ్చిగా మాట్లా డొద్దు...ప్రజలని రెచ్చగొట్టొద్దు:మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-01-13T21:19:30+05:30 IST

దయచేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్ట వద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి మరోసారి విజ్ఞప్తి

పిచ్చిగా మాట్లా డొద్దు...ప్రజలని రెచ్చగొట్టొద్దు:మంత్రి ఎర్రబెల్లి

మైలారం: దయచేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని, ప్రజలను రెచ్చగొట్ట వద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి మరోసారి విజ్ఞప్తి చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు సంక్రాంతి పండుగ కానుక గా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగించిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి ఈ విధంగా స్పందించారు.


బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. బిజెపి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బిజెపి పార్టీ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తూ అధికారంలో ఉంది. ఇలాంటి స్థానంలో ఉన్న పార్టీ గాని, అలాంటి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామ్యంపై గౌరవం తిరిగేలా మాటలు, విమర్శలు ఉంటే ప్రజలు హర్షిస్తారు. అధికారమే పరమావధి కాదని, ప్రజా సేవ, ప్రజల యోగక్షేమాలు, సమాజంలో శాంతియుత పద్ధతులు కొన సాగాలన్నారు. బండి సంజయ్ మాటలు ప్రజలను, వారి మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.


అభివృద్ధి మీద తెలుసుకోవాలనుకుంటే ఎవరు ఏం చేశారన్నది ప్రజలకు తెలిసేలా అధికారికంగానే సమావేశం అవడానికి సిద్ధపడాలని మంత్రి బండి సంజయ్ కి సూచించారు. ఏ వో కొన్ని మాటలతో రెచ్చగొట్టి,  ప్రజలను మోస పుచ్చే మాటలు మంచివి కావని హితవుపలికారు. ప్రజాప్రాతినిధ్య పదవుల్లో ఉన్నవారు ప్రజాస్వామిక పద్ధతిలో గౌరవం పెరిగేలా మాట్లాడుకుంటే మంచిదని మంత్రి చెప్పారు. ప్రజలు నేతల మాటలనే కాక, పార్టీల పద్ధతులను, ప్రభుత్వాల అభివృద్ధి తీరును కూడా గమనిస్తూ ఉంటారని, సందర్భం వచ్చినప్పుడు వారి తీర్పును ఇస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలని మంత్రి చెప్పారు.

Updated Date - 2021-01-13T21:19:30+05:30 IST