మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు
ABN , First Publish Date - 2021-05-18T05:33:13+05:30 IST
మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు
![మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు](https://media.andhrajyothy.com/appimg/galleries/192105181201164/05182021000255n44.jpg)
అనుబంధంగా నర్సింగ్ కాలేజీ
మంత్రి సత్యవతిరాథోడ్ హర్షం
మహబూబాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి) : గిరిజన జిల్లాగా పేరున్న మానుకోటకు మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంజూరు చేయడంపట్ల రాష్ట్ర గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. మానుకోటలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో మహబూబాబాద్ జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. దానికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఇవ్వడం మరో సంతోషకరమైన విషయమని అన్నారు. రాష్ట్రంలో 12 రీజినల్ సబ్సెంటర్లను ఏర్పాటు చేశారని ఇందులో మానుకోటను రీజినల్ సబ్సెంటర్గా ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని కృతజ్ఞతలు తెలిపారు.
పుట్టినరోజు కానుకగా భావిస్తున్నా : ఎమ్మెల్యే శంకర్నాయక్
మానుకోట ప్రజల చిరకాలవాంఛ అయిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఇచ్చిన పుట్టినరోజు కానుకగా భావిస్తున్నానని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు ఈనెల 20న ఉండగా మూడు రోజుల ముందుగానే తనకు భారీ కానుకగా మెడికల్ కళాశాలను ఇచ్చారని తెలిపారు. మహబూబాబాద్కు మెడికల్ కళాశాల కావాలని పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించానని తెలిపారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ మానుకోట ప్రజలకు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం మెడికల్ కళాశాలను మంజూరు చేశారని హర్షం వ్యక్తం చేశారు. అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.