కేసముద్రంలో పత్తి క్వింటా రూ.8000
ABN , First Publish Date - 2021-10-26T05:15:05+05:30 IST
కేసముద్రంలో పత్తి క్వింటా రూ.8000
మార్కెట్ సీజన్లో రికార్డు ధర
కేసముద్రం, అక్టోబరు 25 : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరుగుతోంది. మార్కెట్ చరిత్రలో పత్తి సీజన్లో ఏనాడూ లేని విధంగా సోమవారం పత్తి క్వింటాకు రూ.8000 నమోదుకావడం విశేషం. మూడు నెలల కిందట ఇదే మార్కెట్లో సీజన్ లేనిసమయంలో పత్తి క్వింటాకు రూ. 8250 నమోదైంది. తాజాగా 97 మంది రైతు లు 178 క్వింటాళ్ల పత్తి తీసుకురాగా ఎలకా్ట్రనిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ (ఈ-నామ్) విధానంలో ఈ-వేలంలో క్వింటాకు గరిష్ఠంగా రూ.8000, కనిష్ఠంగా రూ.3655, సగటున రూ.7829 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. స్థానిక సాయిశ్రీనివాస ట్రెడింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఇద్దరు రైతుల లాట్లకు రూ.8వేలు ధరను ఈ-వేలంలో నమోదు చేయగా ఆ కంపెనీకి దక్కింది. ఈనెల మొదటి వారం నుంచి ఆరంభమైన పత్తి సీజన్లో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఈనెల మొదటి వారంలో సగటు ధర రూ.6500 నుంచి రూ.7వేల వరకు ఉండగా తాజాగా రూ.7200 నుంచి రూ.7800 మధ్యన ఖరీదులు కొనసాగుతున్నాయి.