ధరణితో భూ సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2021-10-30T05:24:35+05:30 IST
ధరణితో భూ సమస్యల పరిష్కారం
గంటల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్
జిల్లాలో 14 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు
కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్తో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ శశాంక అన్నారు. గంటల వ్యవధిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పూర్తై నేరుగా ఇంటివద్దకే పట్టేదార్ పాస్పుస్తకాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చి నేటితో ఏడాది పూర్తైన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ శశాంక ధరణికి సం బంధించిన అంశాలను వెల్లడించారు. గతంలో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ భూ ములను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒకేఒక్క రిజిస్టార్ కార్యాలయం ఉండేదని, తద్వారా రైతులు రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కోసం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొనేదని చెప్పారు. గతేడాది నవంబర్ 29న తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి ధరణితో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూ ములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు గంటల వ్యవధిలోనే పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక మ్యూటేషన్ కోసం ఎంతో ప్రయాస ప డేదని, ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయిందని వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండ తహసీల్దార్ ఆఫీసుల్లో ధరణికి సంబంధించిన వివరాలను ప్లెక్సీల రూపంలో ప్రదర్శించడంతో పాటు మీసేవా కేంద్ర నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, స్లాట్ బుకింగ్లో ఎలాంటి ఇబ్బందులుతలెత్తకుండ పూర్తిదర్శకతతో కొనసాగుతుందని వివరించారు.
14 వేల ధరణి రిజిస్ట్రేషన్లు..
ధరణి ఆరంభించిన నాటి నుంచి ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా 14,052 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,45,878 స్లాట్ బుక్ చేసుకోగా అందులో 10,00,973 పూర్తైనట్లు చెప్పారు. జిల్లా విషయానికొస్తే మొత్తంగా 14,052 రిజిస్ట్రేషన్లు కాగా, అందులో కొనుగోలుపై 6833, గిఫ్ట్ 4556, విరాసత్, వారసత్వంగా 1205, మార్టిగేజ్ కింద 1458 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
అనేక సంవత్సరాలుగా సమస్యల్లో ఉన్న భూములకు ధరణితో పరిష్కారం లభించిందని వివరించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్షకుమార్ ఇత ర ఉన్నతాధికారుల తోడ్పాటుతో జిల్లాలో ధరణిని ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. జిల్లాలో ధరణి విజయవంతం కోసం కృషి చేసిన ఆర్డీవోలు, తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కొమురయ్య, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, తొర్రూరు ఆర్డీవో రమేష్, పాల్గొన్నారు.