ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి
ABN , First Publish Date - 2021-11-21T06:02:59+05:30 IST
ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలి

కలెక్టర్ శశాంక
మహబూబాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఆత్మస్థైర్యంతో ఆడపిల్లలు ముందడుగు వేయాలని కలెక్టర్ శశాంక తెలిపారు. జిల్లా కేంద్రంలోని సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ శశాంక మాట్లాడారు. ఆడపిల్లలు భయాందోళనలతోనే చదువులో వెనుకడుగు వేస్తారని, ఇది సరికాదన్నారు. ఆత్మస్తైర్యంతో ముందడుగు వేసేందుకు క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలోనే సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయని చెప్పారు. ఆడపిల్లలకు రక్షణగా టోల్ ఫ్రీ నంబర్ 1098 ఉందని, సఖి సెంటర్ కూడా మహిళల కోసం కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఏఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. తాను కూడా చిన్నతనంలో వసతిగృహంలో ఉండి విద్యనభ్యసించానని చెప్పారు. కృషి, పట్టుదలతో లక్ష్యసాధన కోసం పనిచేస్తే ఏదైనా సుసాధ్యమేనని చెప్పారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, మ్యాజిక్ షో అందరిని అలరించాయి. శ్రీ చైతన్యస్కూల్ విద్యార్థి చిరుతేజసింగ్ మ్యాప్ ఆధారంగా 196 దేశాల పేర్లను చెప్పడంతో కలెక్టర్ అశ్చర్యపోయారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ నాగవాణి, సంక్షేమ అధికారి స్వర్ణలతలెనినా, కళాశాల ప్రిన్సిపల్ రూపాదేవి పాల్గొన్నారు.