ఎన్నికల ఎత్తుగడే దళితబంధు పథకం: జగన్
ABN , First Publish Date - 2021-09-13T02:01:44+05:30 IST
సీఎం కేసీఆర్ ఓట్ల కోసం చెప్పని అబద్దం ఉండదని, హుజూరాబాద్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే ‘దళిత ఎంపవర్మెంట్ స్కీం’ అని
ఖమ్మం: సీఎం కేసీఆర్ ఓట్ల కోసం చెప్పని అబద్దం ఉండదని, హుజూరాబాద్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే ‘దళిత ఎంపవర్మెంట్ స్కీం’ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అరోపించారు. ఆయన పేరుతో ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో పథకాలు పెట్టి వందశాతం అమలు చేస్తామని కేసీఆర్ చెబుతారని అరోపించారు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంలోనూ అరచేతిలో వైకుంఠం చూపారని ఆరోపించారు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. దళితులు ఎక్కువగా ఉండడంతో అక్కడ ‘దళితబంధు’ గాలం వేస్తున్నారని ఆరోపించారు. ‘దళితబంధు’ కేవలం హుజూరాబద్ ఎన్నికల కోసమే కాకుండా 2023ఎన్నికల లక్ష్యంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిద్వారా దళితులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులకు ఎలాంటి సాధికారిత దక్కకపోగా దాడులు పెరిగాయని లేఖలో జగన్ తెలిపారు.