త్యాగాలు దళితులవి, భోగాలు పరులవి:మంద కృష్ణ
ABN , First Publish Date - 2021-08-06T08:35:55+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో దళితులు త్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక త్యాగాలు చేయని వారే భోగాలు అనుభవిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.
ఖపాలమూరు, ఆగస్టు 5: తెలంగాణ ఉద్యమంలో దళితులు త్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం ఏర్పడ్డాక త్యాగాలు చేయని వారే భోగాలు అనుభవిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి సదస్సు స్థానిక అంబేద్కర్ కళాభవన్లో గురువారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే దళితులు ఎక్కువ అవమానాలు అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్కు ఏడేళ్ల తరువాత దళిత సాధికారత గుర్తుకు వచ్చిందని, దళితులను మరోసారి మోసగించేందుకు కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో దళితులే పదిరోజుల పాటు అండగా నిలిచారన్నారు. ఏ త్యాగాలు కూడా చేయని వారే పదవులు అనుభవించటం దుర్మార్గమని, ఒక్కశాతం ఉన్న వెలమ, 4 శాతం ఉన్న రెడ్లకు మెజారిటీ పదవులు ఇచ్చారని, అధిక శాతం ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అరకొరగానే దక్కాయన్నారు.