మహబూబాబాద్‌లో అటవీశాఖ వాహనాలపై రైతుల దాడి

ABN , First Publish Date - 2021-02-05T17:33:42+05:30 IST

జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడులో అటవీశాఖ వాహనాలపై రైతులు దాడి చేశారు.

మహబూబాబాద్‌లో అటవీశాఖ వాహనాలపై రైతుల దాడి

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడులో అటవీశాఖ వాహనాలపై రైతులు దాడి చేశారు. పోడు భూములలో కందకం(స్ట్రెంచ్) పనులను అటవీ అధికారులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేసిన పోడు రైతులు అటవీశాఖ అధికారులను ఆ ప్రాంతం నుంచి తిప్పి పంపించేశారు. జిల్లాలో గత కొద్ది రోజులుగా అటవీశాఖ అధికారులు, రైతులకు మధ్య పోడు వివాదం నడుస్తోంది. దాదాపు 50ఏళ్లుగా పోడు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు ఉన్నట్టుండి భారీ ఎత్తున ప్రొక్లైనర్ వాహనాలతో కందకాలు తీసి చెట్లు నాటించి చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నాలు చేశారు.


విషయం తెలిసిన గ్రామస్తులు మొత్తం అక్కడకు చేరుకుని అటవీశాఖకు చెందిన వాహనాలను అడ్డుకున్నారు. కొన్నింటిపై దాడి చేయడంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా అటవీశాఖ అధికారులు మాత్రం పోలీసుల సాయంతో ఫెన్సింగ్ వేసే పనులు కొనసాగిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోడు భూములపై ప్రభుత్వం నిర్ధిష్టమైన విధానాలు అమలు చేయకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ములుగు ఏజెన్సీ, భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ, మహబూబాద్ జిల్లా ఏజెన్సీలో తరచుగా ఇలాంటి దాడులు జరుగుతూ వస్తున్నాయి. రైతులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఎప్పుడూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Updated Date - 2021-02-05T17:33:42+05:30 IST