విజయవంతంగా కొనసాగుతున్న లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-16T06:08:48+05:30 IST
విజయవంతంగా కొనసాగుతున్న లాక్డౌన్
భారీ బందోబస్తు.. సీపీ తనిఖీలు..
నాలుగో రోజూ సంపూర్ణం
హన్మకొండ, మే 15 (ఆంధ్రజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లాలో నాలుగో రోజు లాక్డౌన్ సంపూర్ణంగా అమలైంది. రోడ్లపై వాహనాలు తిరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లు, ఇతర ముఖ్య కూడళ్లలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన వాహనదారుల వివరాలను నమోదు చేసుకున్నారు. జరిమానాలు విధించారు. కొన్ని వాహనాలను సీజ్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి దుకాణాలను మూసివేయించారు. కాలనీల్లో తెరిచిఉన్న దుకాణదారులను హెచ్చరించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులకు వెనక్కి పంపించారు. ఈ - పాస్ ఉన్న వాహనాలకే అనుమతిచ్చారు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య కొనుగోలుదారులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మద్యం దుకాణాలు జాతరను తలపిస్తున్నాయి. కూరగాయల మార్కెట్లు కిటకిటలాడాయి.