కార్యకర్త కుమార్తెకు కేటీఆర్ బర్త్డే గిఫ్ట్
ABN , First Publish Date - 2021-03-14T07:55:45+05:30 IST
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త కుమార్తె జన్మదినం సందర్భంగా ఆమెకు మంత్రి కేటీఆర్ గిఫ్ట్ పంపించి ఆశ్చర్యపరిచారు.
![కార్యకర్త కుమార్తెకు కేటీఆర్ బర్త్డే గిఫ్ట్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్/కరీంనగర్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త కుమార్తె జన్మదినం సందర్భంగా ఆమెకు మంత్రి కేటీఆర్ గిఫ్ట్ పంపించి ఆశ్చర్యపరిచారు. కరీంనగర్కు వచ్చినప్పుడు స్వయంగా కలిసి ఆశీర్వదిస్తానని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ 20 రోజులుగా హైదరాబాద్లో ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఖాజా మామ చనిపోయినా అంత్యక్రియలకు వెళ్లకుండా హైదరాబాద్లోనే పార్టీ ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు ఖాజా హుస్సేన్ భార్య 9 నెలల గర్భవతి. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా ఈ విషయం కేటీఆర్ దృష్టికి వచ్చింది. కార్యకర్త నిబద్ధతకు చలించిపోయిన కేటీఆర్ ఖాజా హుస్సేన్ యోగక్షేమాలు విచారిస్తున్న సందర్భంలో శనివారం తన కూతురు నబీలా మహ్మద్ పుట్టిన రోజు అని తెలిసింది. వెంటనే పుట్టిన రోజు కానుకగా ఒక ట్యాబ్, టెడ్డీబేర్తోపాటు కేక్ను పాపకు అక్కడి నాయకుల ద్వారా అందించే ఏర్పాట్లు చేశారు. ఆ పాపకు స్వయంగా ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.