ఎరను తిని తప్పించుకుంటున్న పెద్ద పులి
ABN , First Publish Date - 2021-01-13T21:11:23+05:30 IST
పెద్ద పులి తెలివిగా వ్యవహరిస్తోంది. పర్యవేక్షిస్తున్న అటవీ అధికారుల కన్నుగప్పి..
![ఎరను తిని తప్పించుకుంటున్న పెద్ద పులి](https://media.andhrajyothy.com/appimg/galleries/2021011303380116/01132021153945n91.jpg)
కొమురంభీం జిల్లా: పెద్ద పులి తెలివిగా వ్యవహరిస్తోంది. పర్యవేక్షిస్తున్న అటవీ అధికారుల కన్నుగప్పి.. బోనుల నుంచి తప్పించుకుని.. ఎరను ఆరగించి వెళ్లిపోతోంది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈసారి ఎలాగైనా పులిని పట్టుకోవాలని పకడ్బంధిగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కొమురంభీం జిల్లాలో ఇద్దరిని హతమార్చిన పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు గట్టి చర్యలు చేపడుతున్నారు. బెజ్జూరు అడవుల్లో ఏ2 పులిని బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది.
కంది భీమన్న అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో పులి సంచరిస్తున్న ప్రాంతంలో 10 బోన్లు ఏర్పాటు చేశారు. ఎరగా లేగ దూడలను ఉంచారు. వందకుపైగా సీసీ కెమెరాలతో ఆపరేషన్ను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే రెస్క్యూ టీమ్, మత్తు మందు నిపుణులు, షూటర్లు ఉన్నారు. పులి రాగానే మంచెపై నుంచి మత్తు మందు ప్రయోగించేలా ఏర్పాట్లు చేశారు. విధుల్లో 60 మంది టైగర్ ట్రాకర్స్, మహారాష్ట్ర నిపుణులు ఉన్నారు. ఈ ఆపరేషన్ను సీసీఎఫ్ వినోద్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.