కోకాపేట.. కాక!

ABN , First Publish Date - 2021-07-20T06:46:50+05:30 IST

కోకాపేట భూముల వేలంలో గోల్‌మాల్‌ జరిగిందని, ఇళ్ల పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపాలంటూ

కోకాపేట.. కాక!

  • టీపీసీసీ చేపట్టిన ధర్నాకు ముందస్తు బ్రేక్‌.. ఎక్కడికక్కడ ముఖ్య నేతల గృహనిర్బంధం
  • సబితానగర్‌ వాసుల ఆందోళనతో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జి.. పలువురి అరెస్టు
  • వేలం వేసిన భూముల్ని గుంజుకుంటాం.. సోనియా ప్రభుత్వం వచ్చాక లెక్కలు తీస్తాం
  • మళ్లీ వేలం వేస్తాం.. కేంద్ర హోం మంత్రి, సీబీఐకి ఫిర్యాదు చేస్తాం: రేవంత్‌రెడ్డి
  • పార్లమెంట్‌కు రాకుండా అడ్డుకున్నారంటూ స్పీకర్‌కు లేఖ రాసిన ఎంపీ


నార్సింగ్‌/హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): కోకాపేట భూముల వేలంలో గోల్‌మాల్‌ జరిగిందని, ఇళ్ల పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపాలంటూ టీపీసీసీ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో కోకాపేట భూముల పరిశీలన కార్యక్రమాన్ని టీపీసీసీ తలపెట్టింది. అయితే, ముందే అప్రమత్తమైన పోలీసులు సోమవారం ఉదయమే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, దామోదర్‌రెడ్డి తదితరులను గృహ నిర్భంధంలో ఉంచారు.


అదే క్రమంలో కోకాపేట గుట్టకు నలువైపులా భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు. కానీ, పోలీసుల కళ్లు గప్పి మహే్‌షకుమార్‌ గౌడ్‌తోపాటు మరికొందరు నేతలు కోకాపేట భూముల వద్దకు వెళ్లి జెండాలు పాతారు. కోకాపేట గుట్ట కింద ఇళ్లు కోల్పోతున్న సబితానగర్‌ వాసులు సైతం అక్కడికి చేరుకుని మెరుపు ధర్నా నిర్వహించారు. తాజాగా వేలం వేసిన స్థలానికి రోడ్డు వేసేందుకు సబితానగర్‌లోని 50కిపైగా ఇళ్లను తొలగించనుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారందరినీ నిర్దాక్షిణ్యంగా లాగి పడేసి, లాఠీలు ఝళిపించారు. కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.




అయితే, కోకాపేట గుట్టపై తమకు ఇళ్లపట్టాలు ఇచ్చి పొజిషన్‌ ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన ఖానాపూర్‌లోని 210 మంది బాధితులు ధర్నాకు దూరంగా ఉన్నారు. తాము న్యాయ పోరాటం చేస్తున్నామని ధర్నాకు రాలేమని కాంగ్రెస్‌ నాయకులకు వారు చెప్పినట్లు తెలిసింది.


ఎవ్వరినీ వదలం


కోకాపేటలో తక్కువ ధరకు భూముల కొన్న ఐదు సంస్థలను వదలబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పద్దెనిమిది నెలల తర్వాత సోనియమ్మ రాజ్యం రానుందని, అప్పుడు లెక్కా పత్రం తీసి సమగ్ర విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. అక్రమంగా కొల్లగొట్టిన భూములను తిరిగి గుంజుకుని, వేలం వేస్తామని స్పష్టం చేశారు. కోకాపేట భూముల అమ్మకంలో దోపిడీని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అప్పటికీ సరైన దిశలో చర్యలు లేకుంటే న్యాయస్థానం తలుపూ తడతామని పేర్కొన్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్‌ ఐజీ ప్రభాకర్‌పై అడ్మినిస్ట్రేషన్‌ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.


ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. మంత్రి కేటీఆర్‌ ఆర్థిక ఉగ్రవాది అని, ఆయనకు సహకరిస్తున్న వారు తీవ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్న పోలీసు అధికారుల చిట్టాను డైరీలో రాస్తున్నామని, తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని క్షమించేది లేదన్నారు. కోకాపేట భూములకు సంబంధించి తాను వెల్లడిస్తున్న వివరాల్లో ఏదైనా తప్పుంటే తనపై కేసులు పెట్టుకోవచ్చని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ సంస్థ ఉండగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎ్‌సపీసీ ద్వారా టెండర్లు పిలవాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. టెండర్లలో ఎవరెవరు బిడ్లు దాఖలు చేశారు? వారి పేర్లను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. టెండర్లలో పాల్గొనే సంస్థల సమర్థతను టెక్నికల్‌ బిడ్లలో చూడకపోతే దావూద్‌ఇబ్రహీం వంటి వారూ భూములు కొనుక్కునే అవకాశం ఉంటుందన్నారు.


కోకాపేటలో 210మంది పేదలకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, ఆ భూములను కేసీఆర్‌ గుంజుకుని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అప్పు కోసం కేసీఆర్‌ ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లనవసరం లేదని, కేటీఆర్‌, సంతోష్‌ ను అడిగితే పదిపైసల వడ్డీకి రూ.లక్ష కోట్లైనా ఇస్తారని ఎద్దేవా చేశారు. ‘‘కోకాపేట భూమిని మేమేమన్నా ఎత్తుకపోతామా? భూములను తెగనమ్ముతుంటే నిరసన తెలిపే స్వాతంత్రం లేదా? నేను అక్కడికి పోతానంటే ఎందుకు లాగులు తడుస్తున్నయి?’’ అని ప్రశ్నించారు.




హైటెక్‌ సిటీ పక్కన, నాలెడ్జి పార్కు దగ్గర గజం భూమి ధర రూ.3లక్షలకుపైగా పలుకుతుండగా, 7,621 గజాల మిగులు భూమిని కల్వకుంట్ల శైలిమ, యలమంచిలి సుష్మ, సీమలకు తక్కువ ధరకే రెగ్యులరైజ్‌ చేశారని రేవంత్‌ ఆరోపించారు. ఆ భూమిని వారు కేటీఆర్‌ సన్నిహితుడు తేలుకుంట్ల శ్రీధర్‌ కంపెనీకి డెవల్‌పమెంట్‌ కోసం ఇచ్చారని తెలిపారు. కోకాపేట భూములు సైతం ఇదేవిధంగా త్వరలో కేటీఆర్‌ సన్నిహితుల వద్దకే డెవల్‌పమెంట్‌ పేరుతో వస్తాయని పేర్కొన్నారు.




హిట్లర్‌లా కేసీఆర్‌ వ్యవహార శైలి: ఠాగూర్‌


న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్‌.. హిట్లర్‌లా వ్యహరిస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాగూర్‌ ధ్వజమెత్తారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కానీయకుండా ఎంపీ రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని ఆయన ఢిల్లీలో ఖండించారు.




స్పీకర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు


పార్లమెంటు సమావేశాలకు తాను హాజరు కాకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో గొంతు వినిపించాలని, ప్రభుత్వ భూముల అమ్మకాల్లో దోపిడీ పర్వాన్ని ప్రస్తావించాలని తాను భావించగా.. పోలీసులు తనను అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారాలను ఉపయోగించి తాను పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు ఆయన లేఖ పంపారు.


కాగా, రేవంత్‌ గృహ నిర్బంఽధాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పలు చోట్ల ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనం చేశారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.


Updated Date - 2021-07-20T06:46:50+05:30 IST