అపహరించి.. విక్రయించి..
ABN , First Publish Date - 2021-10-26T05:17:19+05:30 IST
అపహరించి.. విక్రయించి..

14 రోజుల తర్వాత బాలుడిని కాపాడిన పోలీసులు
మట్టెవాడ, అక్టోబరు 25 : వరంగల్ మట్టెవాడలో 14 రోజుల క్రితం కిడ్నా్పకు గురైన రెండేళ్ల బాలుడు డానియల్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాప్ కేసు నమోదైనప్పటి నుంచి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానంతో బాలుడి ఆచూకీ, కిడ్నాపర్లు ఉపయోగించిన ఆటోలను గుర్తించారు. ఆటో నెంబర్ను చిన్నగా రాయడంతో గుర్తించడం జాప్యం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. వరంగల్ మట్టెవాడ పోలీ్సస్టేషన్ పరిధిలో జెమిని టాకీస్ వద్ద ఎస్వీఎన్ రోడ్డులో తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలుడిని అక్టోబరు 11న గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సీసీ పుటేజీ ఆధారంగా ఆటోలో వచ్చిన వ్యక్తులు దోమ తెరలో పడుకున్న బాలుడిని దోర తెరను కట్ చేసి ఎత్తుకెళ్లారు. ముఠా సభ్యులు హైదరాబాద్లో రూ.2 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల విచారణ తేలినట్టు తెలిసింది. కాగా, గులేర్లు విక్రయిస్తూ జీవిస్తున్న ఐశ్వర్య, ఆర్య కుమారుడు డానియల్ కిడ్నాప్ నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు.
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు?
నర్సంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు హైదరాబాద్కు చెందిన మరో నలుగురు ఈ కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా వ్యవరించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం ఆరుగురి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పథకం ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు విచారణలో తెలిపినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం డానియల్ను మట్టెవాడ పోలీ్సస్టేషన్కు తీసుకువచ్చారు. డానియల్ కొన్ని రోజులుగా బెంగతో ఉండటంతో పోలీసులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆరోగ్యం పరీక్షలు నిర్వహించారు.