త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ
ABN , First Publish Date - 2021-07-20T22:21:59+05:30 IST
రాష్ట్రంలోరెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో
హైదరాబాద్: రాష్ట్రంలోరెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో బీసీ వర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణ, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనే అంశాల పై ప్రగతి భవన్లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కులవృత్తులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైనవన్నారు. తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తొలి విడతలో 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రెండో విడతలో 6వేల కోట్లతో గొర్రెల పంపిణీని చేపడుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.
ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. రెండో విడత పంపిణీకోసం మరో 6000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు సీఎం తెలిపారు. మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుందన్నారు. ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతోపాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.