కేసీఆర్‌ హెచ్చరికతో దిగొచ్చిన కేంద్రం

ABN , First Publish Date - 2021-11-22T05:25:46+05:30 IST

కేసీఆర్‌ హెచ్చరికతో దిగొచ్చిన కేంద్రం

కేసీఆర్‌ హెచ్చరికతో దిగొచ్చిన కేంద్రం
మాట్లాడుతున్న కడియం శ్రీహరి

రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నది..

కేంద్రం రైతు పండించిన ప్రతీగింజా కొనాల్సిందే..

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హనుమకొండ టౌన్‌, నవంబరు 21: రైతులకు మద్దతుగా ఢిల్లీలో ధర్నా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన హెచ్చరికతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు 10లక్షల 60వేల కోట్లు మాఫీ చేసిన కేంద్రం.. రైతుల విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని ప్రశ్నించారు. ఆదివారం హనుమకొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు.  ప్రధాని మోదీ రైతు, దళిత వ్యతిరేకి అని, బీజేపీ ఏడేళ్ల పాలనలో దేశ ప్రగతి దిగువస్థాయికి చేరుకుందని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేక దేశం అన్నిరంగాల్లో వెనుకబడుతోందన్నారు. చట్టం ప్రకారం రైతులు పండించిన ప్రతీ పంటను కేంద్రం కొనుగోలు చేయాలన్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నారు. అంబానీ, అదానీలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలుంటున్నాయని కడియం ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతోందన్నారు. 

కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతలు బద్మాష్‌ మాటలు మానాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దని, సహకరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంపట్ల కేంద్రం వివక్ష కనబరుస్తోందని, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడం లేదన్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో దూసుకుపోతోందన్నారు. ఇక్కడి రైతులకు రెండు పంటలకు సాగునీటితో పాటు ఉచిత విద్యుత్‌, పెట్టుబడి, భీమా అందిస్తూ, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. కాగా, తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-11-22T05:25:46+05:30 IST