రూ.1,764 కోట్లతో మెదక్ రైల్వేలైన్కు ప్రతిపాదనలు
ABN , First Publish Date - 2021-01-18T08:40:26+05:30 IST
పటాన్చెరు-సంగారెడ్డి-జోగిపేట-మెదక్ రైల్వే లైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే రూ.1,764 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిందని జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైల్వేలైన్ సాధన సమితి అధ్యక్షుడు గంగా జోగినాథ్గుప్తా
రైల్వేలైన్ సాధన సమితి అధ్యక్షుడు జోగినాథ్ గుప్తా
జోగిపేట, జనవరి 17: పటాన్చెరు-సంగారెడ్డి-జోగిపేట-మెదక్ రైల్వే లైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే రూ.1,764 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిందని జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రైల్వేలైన్ సాధన సమితి అధ్యక్షుడు గంగా జోగినాథ్గుప్తా తెలిపారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సహకారంతో ఈ లైన్ కార్యరూపం దాలుస్తోందన్నారు. పటాన్చెరు(వట్టినాగులపల్లి) నుంచి సంగారెడ్డి, జోగిపేట, రంగంపేట మీదుగా మెదక్ వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం గత నెల 31న రూ.1,764 కోట్లతో ప్రతిపాదనలను పంపిందని చెప్పారు. వట్టినాగులపల్లి నుంచి ఏర్పాటవుతున్న ఈ లైనులో ఇంద్రకరణ్, సంగారెడ్డి, చక్రియాల్, చౌటకూరు, జోగిపేట, దుంపల కుంట, చిన్నఘన్పూర్, మాచారం, మెదక్లలో స్టేషన్లు ఏర్పాటవుతాయని చెప్పారు.