బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా..విపక్షాలు కేంద్రాన్ని ఒప్పించాలి
ABN , First Publish Date - 2021-11-02T08:46:12+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు నోరు పారేసుకోవడం కాదని, కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేసేలా కృషి చేయాలి మంత్రి హరీశ్రావు సూచించారు.
![బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా..విపక్షాలు కేంద్రాన్ని ఒప్పించాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/192111020213820/11022021031610n13.jpg)
- ఎంత పంట వచ్చినా కొనేందుకు సిద్ధం
- సీఎం కేసీఆర్ కృషి వల్లే పెరిగిన సాగు, దిగుబడి: హరీశ్
సిద్దిపేట టౌన్, నవంబరు1: రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు నోరు పారేసుకోవడం కాదని, కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేసేలా కృషి చేయాలి మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లాలో వానాకాలంలో రికార్డు స్థాయిలో 3 లక్షల 3 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 7లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందన్నారు. ఎంత పంట వచ్చినాకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ యాసంగి నుంచి పార్బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని ఎఫ్సీఐ చెప్పిందని, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బోరు బావుల నుంచి నీరు ఉబికి వస్తోందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు.