భ్రమల బడ్జెట్‌

ABN , First Publish Date - 2021-03-21T08:42:06+05:30 IST

భ్రమలు కల్పించేలా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారని, వాస్తవాలకు దూరంగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

భ్రమల బడ్జెట్‌

అంతా వాస్తవాలకు దూరం: భట్టి 

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): భ్రమలు కల్పించేలా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారని, వాస్తవాలకు దూరంగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రూ.2.30 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. గతేడాది రుణాల చెల్లింపులకు రూ.45 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ.9139 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. పన్నేతర ఆదాయం రూ.50 వేల కోట్లు వస్తుందని చూపించారు. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్ని భూములు అమ్మినా ఆ స్థాయిలో నిధులు వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో 2015 నుంచి వృద్ధిని పరిశీలిస్తే 20 శాతానికి మించి లేదు. ఏటా రాబడి రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల దాకా పన్నేతర ఆదాయం ద్వారా వస్తోందని, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా కూడా రూ.38 వేల కోట్లు కేంద్రం నుంచి వస్తాయని చూపించారు. 


ఏ సంవత్సరం కూడా రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్లకు దాటలేదు. ప్రతిపాదించిన బడ్జెట్‌ లెక్కల ప్రకారం మిగిలేది రూ.1.17 లక్షల కోట్లే. ఇందులో అప్పుల కోసం రూ.50 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. వేతనాలు, పెన్షన్లకు రూ.40 వేల కోట్లు అవసరముంటాయి. రైతుబంధు, రైతుబీమా ఇతరత్రా పథకాలకు రూ.63 వేల కోట్లు కావాలి. ఇక మిగతా పథకాలకు నిధుల సంగతేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. అలాగే అప్పులు ఆందోళనకరస్థాయిలో ఉన్నాయన్నారు. కాగా బడ్జెట్‌పై భట్టి మాట్లాడుతుండగా.. సభ్యుల సంఖ్య ఆధారంగానే పార్టీలకు సమయం ఇస్తామని, 100 మంది సభ్యులు ఉన్నవారు కూడా మాట్లాడాల్సి ఉందని స్పీకర్‌ జోక్యం చేసుకున్నారు. బడ్జెట్‌పై చర్చించడానికి అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అంటూ భట్టి బదులిచ్చారు. 

Updated Date - 2021-03-21T08:42:06+05:30 IST