10 వేల కోట్లు ఇస్తే.. ప్రతి గింజా కొంటాం
ABN , First Publish Date - 2021-11-28T08:19:54+05:30 IST
పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టానికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు.

- రూ.500 బోనస్ కూడా ఇస్తాం
- సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్
- రైతులపై కేసీఆర్ కక్షగట్టారు
- సీఎం గద్దెపై కూర్చునే హక్కు లేదు
- వడ్లు కొనకపోతే రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్, బీజేపీని ఉరి తీస్తారు
- కేసీఆర్, మోదీ వేర్వేరు కాదు
- ఢిల్లీకి వెళ్లి ఏం చేశారు?: రేవంత్
- రైతులను నట్టేట ముంచుతున్న ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్: ఉత్తమ్
- ధనార్జనే కేసీఆర్ ధ్యేయం: కోమటిరెడ్డి
- ధర్నాచౌక్లో కాంగ్రెస్ వరి దీక్ష
హైదరాబాద్/కవాడిగూడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు పడుతున్న కష్టానికి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. వరి వేయవద్దంటూ సీఎం గతంలో చెప్పినా రైతులు వేసినందుకు వారిపై కక్ష కట్టారని ధ్వజమెత్తారు. 45 రోజులు ఆలస్యం చేసి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. రైతులు పండించిన వడ్లు కొనని కేసీఆర్కు సీఎం కుర్చీలో కూర్చునే హక్కు లేదన్నారు. బీజేపీ, కేసీఆర్ వేర్వేరు కాదని, ఇద్దరూ తోడుదొంగలేనని అన్నారు. వరికి ఉరేయాలని కంకణం కట్టుకుని వీరు బయలుదేరారని ఆరోపించారు. వడ్లు కొనకపోతే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎ్సలను ప్రజలు ఉరితీయడం ఖాయమన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇవ్వాలని, వాటితో తాము చివరిగింజ వరకూ వడ్లను కొని చూపిస్తామని అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనాలన్న డిమాండ్తో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద చేపట్టిన రెండు రోజుల వరి దీక్ష.. శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ, ‘‘రైతులు పండించిన వడ్లు కొనడం చేతకాకుంటే కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇవ్వు. చివరి గింజ వరకూ కొని చూపిస్తం. విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటం. క్వింటాలుకు మద్దతు ధర రూ. 1960కు అదనంగా రూ.500 బోనస్ కూడా ఇస్తం. ఈ పని చేయకుంటే ప్రజలను ఓట్లు కూడా అడగం’’ అని అన్నారు. ధనిక రాష్ట్రంలో పంట కొనుగోలుకు రూ.10 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టలేరా? అని ప్రశ్నించారు. వైన్ షాపుల కోసం ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే రూ.12 వేల కోట్లు డిపాజిట్లు వచ్చాయని, అందులో సగం డబ్బులు పెడితే రైతు పండించిన పంట మొత్తం కొనుగోలు చేయవచ్చునని అన్నారు.
ప్రధానిని ఎందుకు నిలదీయలేదు?
‘‘సన్నాసులను, సోయిలేనోళ్లను.. ఢిల్లీకి తీసుకెళ్లి దావత్ చేసుకున్న సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కలిసి వడ్ల కొనుగోళ్లపై ఎందుకు నిలదీయలేదు?’’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో నాలుగు రోజులుండి కూడా ఈ అంశంపై ప్రధానినిగానీ, కేంద్ర మంత్రులను గానీ సమయం కోరలేదన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇక వరి గురించి మాట్లాడబోరని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన తర్వాత.. రాష్ట్రంలోని గుండు, అరగుండులను నమ్ముకునే పరిస్థితి ఉందా? అని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులమంతా ఈ రాత్రి ఇక్కడే పడుకుంటామని, రాష్ట్రంలోని రైతులు, కాంగ్రెస్ శ్రేణులు వరి దీక్షకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మోదీ, కేసీఆర్ ఎలా దిగిరారో చూద్దామన్నారు. చలిలో ధాన్యం కుప్పలపైన పడుకుని రెతులు చనిపోతే.. సహజ మరణాలంటూ అవహేళన చేశారని, వారికి రైతు బీమా అమలు కాకుండా చేశారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ రైతులను నట్టేట ముంచారని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సిల్లీగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోందన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోకుండా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో స్పష్టం చేయాలన్నారు. కేసీఆర్కు మానవత్వం లేదని, కేవలం ధనార్జనే ఆయన ధ్యేయమని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్లో ఓ ఎమ్మెల్యే రూ.12 కోట్ల విలువైన కారులో తిరుగుతున్నారని అన్నారు. ఈ దీక్షలో ఏలేటి మహేశ్వర్రెడ్డి, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సీతక్క, కోదండరెడ్డి, అన్వే్షరెడ్డి, చిన్నారెడ్డి, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల రాజయ్య, సునితారావు తదితరులు పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కన్నెగంటి రవి తదితరులు కాంగ్రెస్ వరి దీక్షకు హాజరై సంఘీబావం తెలిపారు. కాగా, కాంగ్రెస్ వరిదీక్ష.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితర నేతలంతా శనివారం రాత్రి ధర్నాచౌక్లోనే నిద్రించారు.
సంతోషంగా ఉంది: ఠాగూర్
ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ వరి దీక్షలో ముగ్గురు పార్టీ ఎంపీలూ పాల్గొనడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి దీక్షలో కూర్చున్న ఫొటోను టీపీసీసీ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఠాగూర్ దానిని రీట్వీట్ చేస్తూ ‘హ్యాపీ టు సీ దిస్’ అని పేర్కొన్నారు.
ధాన్యం దళారుల పాలు: భట్టి
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతూ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా.. రైతుల పంటను దళారుల పాలు చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలోని వరిపొలాలు, కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం రాశులను శనివారం ఆయన పరిశీలించారు.
పీసీసీతో కోమటిరెడ్డి రాజీ!
కాంగ్రెస్ వరి దీక్ష సందర్భంగా ధర్నాచౌక్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శనివారం అదే రేవంత్రెడ్డితో చేయి కలిపారు. వేదికపై రేవంత్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో ఉల్లాసంగా మాట్లాడారు. ఇద్దరు కలిసి కార్యకర్తలకు వేదికపై నుంచి అభివాదం చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి వెంకట్రెడ్డి టీపీసీసీపైనా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణక్యం ఠాగూర్పైనా సమయం దొరికినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం పట్ల అధిష్ఠానం తీవ్ర అసహనంగా ఉందని, సమయం కోసం వేచి చూస్తుందనీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. కాంగ్రెస్ దీక్షకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ పరిణామం వెనుక పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు మధ్యవర్తిత్వం ఉంది. ఆయన సూచనతో మెత్తబడ్డ వెంకట్రెడ్డి.. రేవంత్ పిలుపుతో వచ్చి దీక్షలో పాల్గొన్నారు. రాజగోపాల్రెడ్డి కూడా త్వరలోనే కాంగ్రె్సపార్టీతో పూర్తిస్థాయిలో కలిసి పనిచేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల టీపీసీసీ సీనియర్ నేత ఒకరికి రాజగోపాల్రెడ్డి ఫోన్ చేసి తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
