చికెన్‌ లేదన్నందుకు సర్వర్‌ హత్య

ABN , First Publish Date - 2021-05-20T16:41:02+05:30 IST

హోటల్‌లో చికెన్‌ లేదన్నందుకు కక్ష పెంచుకుని సప్లయర్‌ను హతమార్చిన నలుగురిని సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు ...

చికెన్‌ లేదన్నందుకు సర్వర్‌ హత్య

నలుగురి అరెస్ట్ట్‌.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌: హోటల్‌లో చికెన్‌ లేదన్నందుకు కక్ష పెంచుకుని సప్లయర్‌ను హతమార్చిన నలుగురిని సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా బసవకళ్యాణం తాలుకా మొర్కందివాడి గ్రామానికి చెందిన పి.మహేష్‌(20), పి.విజయ్‌(24) అన్నదమ్ములు కొత్తపేట పండ్ల మార్కెట్‌లోని ఓ పండ్ల దుకాణంలో హమాలీలుగా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈ నెల 13న మహేష్‌, విజయ్‌ మరో ఇద్దరు బాలురు కొత్తపేట పండ్ల మార్కెట్‌ ఎదురుగా ఉన్న శ్రీ దుర్గా భవానీ హోటల్‌కు వెళ్లి భోజనంతో పాటు చికెన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. సర్వర్‌ బాలాజీ వచ్చి చికెన్‌ లేదని కావాలంటే బోటి తీసుకోవాలని చెప్పి లోపలికి వెళ్లాడు. మహేష్‌ అతని వెనకాలే కిచెన్‌లోకి వెళ్లగా, అక్కడ కొద్దిగా చికెన్‌ కనిపించింది. దీంతో ‘చికెన్‌ ఉన్నా మాకు ఇవ్వవా’ అంటూ గొడవకు దిగాడు. ఈలోగా హోటల్‌ యజమాని సుధాకర్‌ వచ్చి సర్దిచెప్పడంతో, వారు నలుగురు భోజనం చేసి బిల్లుకట్టకుండా వెళ్లిపోయారు. 

చికెన్‌ ఉన్నా తమకు ఇవ్వలేదని కోపం పెంచుకున్న నలుగురు సర్వర్‌ బాలాజీని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో నలుగురు మరోసారి హోటల్‌కు వచ్చారు. ముగ్గురు హోటల్‌ బయట ఉండగా, మహేష్‌ లోపలకు వెళ్లి బాలాజీ బయటకు తీసుకుని వచ్చాడు. బాలాజీ పై నలుగురు దాడి చేయడంతో పాటు మహేష్‌ బండరాయితో తలపై మోదాడు. దీంతో రక్తస్రావం కావడంతో నలుగురు అక్కడినుంచి పారిపోయారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

తీవ్రగాయాలపాలైన బాలాజీని కొత్తపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 15న బీదర్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ 17న మృతి చెందాడు. దీంతో రంగంలోకి దిగిన సరూర్‌నగర్‌ ఎస్‌ఐ సైదులు బృందం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-05-20T16:41:02+05:30 IST