హుజూరాబాద్లో పారని దళితబంధు పాచిక
ABN , First Publish Date - 2021-11-02T16:38:16+05:30 IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు.
![హుజూరాబాద్లో పారని దళితబంధు పాచిక](https://media.andhrajyothy.com/appimg/galleries/1921110211063250/11022021111133n32.jpg)
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని ముందుగా ఎన్నికల సంగ్రామమైన హుజూరాబాద్ నుంచే మొదలు పెట్టారు. ఈ పథకంతో దళితుల ఓట్లు తమకే వస్తాయని కేసీఆర్ భావించారు. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనే టీఆర్ఎస్కు ఆదరణ కరువైంది. శాలపల్లిలో సీఎం కేసీఆర్ సభ కూడా పెట్టారు. అయినా శాలపల్లి ఓటర్లను టీఆర్ఎస్ ఆకర్షించలేకపోయింది. శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 135 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదటి రౌండ్లో పోతిరెడ్డి పేట, వెంకట్రావు పల్లి, చెల్పూర్, ఇందిరా నగర్, రాజపల్లి, సిరసపల్లితో పాటు శాలపల్లికి సంబంధించిన ఓట్లను కూడా లెక్కించారు. అయితే దళితబంధు ప్రకటించిన శాలపల్లిలోనే టీఆర్ఎస్కు తక్కువ ఓట్లు రావడంతో దళితబంధు లబ్దిదారులు షాకిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ వేసిన పాచిక పారలేదని అంటున్నారు.