కాలుష్య నియంత్రణపై హైకోర్టు సంతృప్తి
ABN , First Publish Date - 2021-04-21T09:51:34+05:30 IST
నగరంలోని శాస్త్రిపురం, టాటానగర్లో కాలుష్యకారక పరిశ్రమలపై జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీసుకున్న చర్యల పట్ల హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
శాస్త్రిపురం కాలుష్యంపై పిల్ మూసివేత
హైదరాబాద్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని శాస్త్రిపురం, టాటానగర్లో కాలుష్యకారక పరిశ్రమలపై జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీసుకున్న చర్యల పట్ల హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా పరిశ్రమలకు చెందిన యంత్రసామగ్రిని ఇక్కడ నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి తగిన సమయం ఇవ్వాలని అధికారులకు సూచించింది. ఈ ప్రాంతంలోని వ్యర్థాలను తొలగించి శానిటైజ్ చేయాలని స్పష్టం చేసింది. శాస్త్రిపురం కాలుష్యంపై 2012లో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని మూసివేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. శాస్ర్తిపురం కాలుష్యంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. అనుమతుల్లేకుండా నిర్మించిన షెడ్లను కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు, కాలుష్యకారక పరిశ్రమలకు పీసీబీ జారీచేసిన క్లోజర్ నోటీసులపై సుమారు 118 యూనిట్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం...అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్న కాలుష్య కారక పరిశ్రమలు తరలించాల్సిందేనని స్పష్టం చేసింది.