‘క్యాబ్’లపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2021-12-30T07:47:52+05:30 IST
ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే ఓలా, ఉబెర్ తదితర

తెలంగాణ ఆటో, టాక్సీ డ్రైవర్ల సంక్షేమ సమాఖ్య
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే ఓలా, ఉబెర్ తదితర ఈ-కామర్స్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నడిచే ఆటో, క్యాబ్లపై జనవరి 1 నుంచి జీఎస్టీ అమలు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఆటో, టాక్సీ డ్రైవర్ల సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది. ఇప్పటికే కొవిడ్ దెబ్బకు ఆటో, టాక్సీ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ఈ కామర్స్కు చెందిన ఆటో, క్యాబ్లపై 5 శాతం జీఎస్టీ వసూలు చేయడం దారుణమని అన్నారు. ప్రస్తుతం ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. గ్రేటర్ పరిధిలో ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన ఆటో, క్యాబ్, టూ వీలర్ టాక్సీలపై లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం జీఎస్టీని మినహాయించి పేద డ్రైవర్లను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని సత్తిరెడ్డి స్పష్టం చేశారు.