టీఎస్పీఎస్సీ ‘సభ్యులపై’ వివరణ ఇవ్వండి
ABN , First Publish Date - 2021-11-09T07:07:50+05:30 IST
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పలువురు టీఎ్సపీఎస్సీ సభ్యులకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది.
![టీఎస్పీఎస్సీ ‘సభ్యులపై’ వివరణ ఇవ్వండి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ సభ్యులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుల నియామకంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పలువురు టీఎ్సపీఎస్సీ సభ్యులకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. అర్హతలు లేని వారిని టీఎ్సపీఎస్సీ సభ్యులుగా నియమించారని ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. టీఎ్సపీఎస్సీ సభ్యుల నియామకం కోసం మే 19న ప్రభుత్వం జీవో 108ని జారీచేసిందని తెలిపారు. ఈ జీవోను సవాల్ చేస్తూ తాము జూన్లోనే పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. నియామకాలపై కౌంటర్లు దాఖలు చేయాలని సాధారణ పరిపాలన, న్యాయశాఖ, టీఎ్సపీఎస్సీ, కమిషన్ సభ్యులకు ఆదేశాలు జారీచేసింది. విచారణ ఈ నెల 29కి వాయిదాపడింది.