విద్యుదాఘాతంతో నలుగురి మృతి
ABN , First Publish Date - 2021-01-18T08:39:28+05:30 IST
రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు చనిపోయారు. పొలంలోని మోటారుకు వేలాడుతున్న విద్యుత్ వైరును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ యువ రైతు, ఎలక్ర్టీషియన్ మృతి చెందారు
సూర్యాపేట జిల్లాలో రైతు, ఎలక్ర్టీషియన్
ఆసిఫాబాద్లో తండ్రీకొడుకు మృత్యువాత
మేళ్లచెర్వు/చింతలమానేపల్లి, జనవరి 17: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు చనిపోయారు. పొలంలోని మోటారుకు వేలాడుతున్న విద్యుత్ వైరును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ యువ రైతు, ఎలక్ర్టీషియన్ మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలోని రామాపురంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతు పాలేటి రాముకు(32).. పొలంలో సర్వీసు విద్యుత్ తీగను అదే గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ర్టీషియన్ గోపి(23)ని తీసుకొని వెళ్లాడు. విద్యుత్ తీగను ఇద్దరూ కలిసి కట్టెలు పెట్టి సరిచేస్తున్న క్రమంలో తీగకు విద్యుత్ సరఫరా అయింది.
దీంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అలాగే కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్లో విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు చనిపోయారు. ఇంటి పైకప్పు రేకులకు ఆనుకుని ఉన్న ఇనుప కొక్కానికి వేలాడదీసిన మంచి నూనె డబ్బాను తీయడానికి కుమారుడు విజయ్కుమార్ (27) ప్రయత్నించే విద్యుత్ సరఫరా జరిగింది. కుమారుడిని కాపాడే క్రమంలో తండ్రి విలాసాగరం శంకర్ (49)కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.