కన్వేయర్ బెల్ట్ పనులను అడ్డుకున్న రైతులు
ABN , First Publish Date - 2021-05-30T06:05:10+05:30 IST
కన్వేయర్ బెల్ట్ పనులను అడ్డుకున్న రైతులు
![కన్వేయర్ బెల్ట్ పనులను అడ్డుకున్న రైతులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మల్హర్, మే 29 : జెన్ భూ ఉపరితల బొగ్గు గనుల తవ్వకాల్లో భాగంగా తాడిచర్ల ఓసీపీలో సాగుతున్న కన్వేయర్ బెల్ట్ నిర్మాణ పనులను కాపురం, తాడిచర్ల గ్రామాల రైతులు శనివారం అడ్డుకున్నారు. దళితులు, గిరిజనులమైన తాము కాపురం, అన్సాన్పల్లి గ్రామ శివారు భూములను నాలుగైదు తరాలుగా దున్నుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. జెన్కో కన్వేయర్ బెల్ట్ నిర్మాణం కోసం 2019లో అప్పటి కలెక్టర్ కార్యాలయానికి పిలిపించుకొని ఎకరానికి రూ. 14 లక్షలు చెల్లిస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే భూ నష్ట పరిహారం మొత్తాన్ని రెవెన్యూ శాఖకు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుత కలెక్టర్ మాత్రం అది ప్రభుత్వ భూమని నష్టపరిహారం ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడం దారుణమన్నారు. తమ భూములను ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మోకాపై వచ్చిన రెవెన్యూ, జెన్కో అధికారులను రైతులు అడ్డుకొని వెనక్కి పంపించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్, నిర్వాసితులు గట్ల సత్యనారాయణ, గోస్కుల సమ్మయ్య, గోస్కుల రవీందర్, చింతల రాజయ్య, చింతల సమ్మయ్య, శీలం లక్ష్మి, చెన్నూరి బాపు, రవి తదితరులు పాల్గొన్నారు.