పడిపోతున్న బొగ్గు నిల్వలు
ABN , First Publish Date - 2021-10-17T09:12:36+05:30 IST
దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) గణాంకాల ప్రకారం..
- 17 థర్మల్ ప్లాంట్లలో శూన్యస్థాయి నిల్వలు
- తెలంగాణలో ఆశాజనకంగానే బొగ్గు నిల్వలు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) గణాంకాల ప్రకారం.. దేశంలోని 17 థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలేలేవు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పనిచేస్తున్న థర్మల్ కేంద్రాల్లో మూడు రోజులకు సరిపడా నిల్వలుండగా...సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పనిచేస్తున్న థర్మల్ కేంద్రాల్లో నాలుగు రోజులకు సరిపోయే నిల్వలే ఉన్నాయి. దేశంలో 1,65,066 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 135 థర్మల్ కేంద్రాలున్నాయి. వీటిలో 35,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 16 ప్లాంట్లు బొగ్గు గనుల ఉదరభాగం(పిట్హెడ్)లో ఉండగా... 1,29,866 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 119 కేంద్రాలు నాన్ పిట్హెడ్వి ఉన్నాయి. పిట్హెడ్ కేంద్రాల్లో 5 రోజులకు సరిపడా నిల్వలు... నాన్ పిట్హెడ్లో 4 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. ఇక రాష్ట్రంలోని నిల్వలను పరిశీలిస్తే... భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో 4 రోజులకు, భూపాలపల్లిలోని కాకతీయలో 12 రోజులకు, కేటీపీఎ్సలో 4 రోజులకు, కేటీపీఎస్-7 దశలో 7 రోజులకు, రామగుండంలోని ఎన్టీపీసీలో 3 రోజులకు, సింగరేణి థర్మల్లో 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి.