నాటి కిరణ్ సర్కార్‌పై ఈటల సతీమణి జమున ప్రశంసలు

ABN , First Publish Date - 2021-05-30T16:44:01+05:30 IST

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ఇలా చేయలేదు. ఇలాంటి పరిస్థితులు ఆనాడు ఉండుంటే యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చేవారే కాదు. తెలంగాణ ప్రజలు ఒక్క అడుగు వేయకపోయేవారు.

నాటి కిరణ్ సర్కార్‌పై ఈటల సతీమణి జమున ప్రశంసలు

హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతటి నిర్బంధం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున వాపోయారు. ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తమ ఇంటి చుట్టూ పోలీసులే ఉన్నారన్నారు. ఎవరిని భయపెట్టడానికి? అని ప్రశ్నించారు. 


‘‘దొంగతనం చేశామా.. టెర్రరిస్టులమా... పిలిచి చెప్పొచ్చు కదా. పోలీసులు, అధికారులు.. మా ఇంటి కోసమే పని చేస్తున్నట్టుగా ఉంది. ఇంటెలిజన్స్ వాళ్లకు మా ఇట్టిదగ్గరే డ్యూటీ వేశారు. మా చుట్టాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ నంబర్ ఎంత.. ఎక్కడ ఉంటారంటూ క్వశ్చన్లు వేస్తున్నారు. పాక్ సరిహద్దులో ఉన్నామా.. తెలంగాణలో ఉన్నామా? ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ఇలా చేయలేదు. ఇలాంటి పరిస్థితులు ఆనాడు ఉండుంటే యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చేవారే కాదు. తెలంగాణ ప్రజలు ఒక్క అడుగు వేయకపోయేవారు. వాళ్లు మెతక వైఖరితో ఉన్నారు. న్యాయబద్దంగా.. ధర్మబద్దంగా ఉన్నారు. ఈయనకైతే ఓ న్యాయం లేదు.. ధర్మం లేదు’’ అంటూ నాటి కిరణ్ సర్కార్‌ను గుర్తు చేసుకున్నారు. 


సీఎం కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి కావాలని జమున ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పటికీ హేచరీస్ దగ్గర పోలీసులు ఉన్నారు. నిన్నమొన్న మీ దగ్గరే కదా పని చేశారు. 20 సంవత్సరాలు ... మీ ప్రగతి భవన్ దగ్గర లేదంటే నియోజకవర్గం దగ్గర ఉండేవారు. ఐదు నిమిషాలు లేట్ కాగానే.. తమ్ముడూ.. ఎక్కడున్నావు అంటూ ఫోన్ చేసేవారు. నేనే కదా చాలా సార్లు ఫోన్ ఎత్తింది. అట్లాంటి తమ్ముడు నేడు దెయ్యమెలా అయ్యాడు. కులరహిత సమాజం కావాలనే ఆనాడు పెళ్లి చేసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చాక.. కులాల వారీగా విభజించించారు’’ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-05-30T16:44:01+05:30 IST