కాపలా కుక్కలా ఉంటానని చెప్పి..
ABN , First Publish Date - 2021-10-21T09:08:06+05:30 IST
కాపలా కుక్కలా ఉంటానని చెప్పి..
కేసీఆర్ మనల్ని కుక్కల్లాగా మార్చాడు: ఈటల
వీణవంక, అక్టోబరు 20: తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, తాను కాపలా కుక్కలాగా ఉంటానని మాటలు చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనల్ని కాపలా కుక్కల్లాగా మార్చాడని మాజీ మంత్రి, బీజేపీ హుజూరాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కిష్టంపేట, ఘన్ముక్ల, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లె గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల మీద ప్రేమతో దళితబంధు పెట్టలేదని, 46 వేల దళితుల ఓట్లపై కన్నేసిన కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడని విమర్శించారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్ లాంటి చోట్ల మోసం చేయవచ్చు.. కానీ హుజూరాబాద్లో మోసం చేయడం వాళ్లకు సాధ్యం కాదన్నారు. హుజూరాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారని, అవసరమైతే బరిగీసి కొట్లాడుతారని చెప్పారు. అసెంబ్లీలో తన ముఖం కనిపించకూడదంటున్నారని, రేపు ఎవరి ముఖం కనిపించదో చూద్దామన్నారు. ఈనెల 30వ తారీఖు తర్వాత కేసీఆర్ కాదు, ఆయన జేజెమ్మతో కొట్లాడుతానని స్పష్టం చేశారు.