‘పల్లా’ విజయం ఖాయం

ABN , First Publish Date - 2021-03-15T04:46:31+05:30 IST

‘పల్లా’ విజయం ఖాయం

‘పల్లా’ విజయం ఖాయం

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


హన్మకొండ టౌన్‌, మార్చి 14: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిదే విజయమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండలోని హరిత హోటల్‌లో ఆదివారం విలేకర్ల సమావేశంలో మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా అధికశాతం ఓటింగ్‌ నమోదైందన్నారు. ప్రతీ పట్టభద్రుడు ఓటు హక్కు వినియోగించుకునేలా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సహకరించారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు సైతం పెద్ద ఎత్తున టీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలపడంతో పాటు పల్లాకు ఓటు వేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంత పట్టభద్రులు సైతం ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. 

బీజేపీ శ్రేణులు గొడవలు సృష్టించే  యత్నం చేశారని, తమ కార్యకర్తలు సంయమనం పాటించారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎవరు గొడవలు సృష్టించినా పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెరిగిన ఓటింగ్‌ శాతం తమకు అనుకూలంగా మారి తమ అఽభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలువబోతున్నాడని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు రుణ విముక్తి కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేత జన్ను జకార్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-15T04:46:31+05:30 IST