నేటి నుంచి నాలుగు రోజులు టీకా బంద్‌

ABN , First Publish Date - 2021-10-14T08:38:25+05:30 IST

సరా సందర్భంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు నాలుగు రోజులు విరామం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం..

నేటి నుంచి నాలుగు రోజులు టీకా బంద్‌

  • దసరా నేపథ్యంలో సెలవు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): దసరా సందర్భంగా ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు నాలుగు రోజులు విరామం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. అక్టోబరు 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిలిచిపోనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ నెలలో ఐదు ఆదివారాలు వ్యాక్సినేషన్‌కు సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటికి అదనంగా మరో మూడు సెలవుదినాలు జతకలిశాయి. కాగా, విరామం లేకుండా అర్హులందరికీ టీకాలివ్వాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆదేశించింది. దీంతో.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్థరాత్రి వరకు టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 


ఇంతలో దసరా రావడంతో.. పండగ ముందు టీకా వేయించుకునేందుకు గ్రామీణులు ఆసక్తి చూపడం లేదు. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందని, దీంతో పండగ చేసుకోలేమన్నది ప్రజల ఉద్దేశమని క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు.. బతుకమ్మ కారణంగా అసలు టీకాలు తీసుకోవడం లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నాలుగురోజుల పాటు వ్యాక్సినేషన్‌కు సెలవు ప్రకటించడమే మంచిదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. కాగా, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 2.41 లక్షల మందికొవిడ్‌ టీకాలు వేయించుకున్నారు. ఇందులో 1,57,387 మంది తొలి డోసు తీసుకోగా.. 83,938 మంది రెండో డోసు అందుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య 2.03 కోట్లకు చేరగా.. రెండు డోసులూ అందుకున్న వారి సంఖ్య 79 లక్షలకు పెరిగింది. 

Updated Date - 2021-10-14T08:38:25+05:30 IST