డిస్కమ్ల నష్టాలు రూ.1625.17 కోట్లు
ABN , First Publish Date - 2021-12-07T08:12:45+05:30 IST
డిస్కమ్ల నష్టాల పరంపరం కొనసాగుతూనే ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల నష్టాలు అక్షరాలా రూ.1625.17 కోట్లుగా నమోదయ్యాయి.
- తొలి ఆర్నెల్ల నష్టాలివి.. యూనిట్కు రూ.1.04 అంతరం
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): డిస్కమ్ల నష్టాల పరంపరం కొనసాగుతూనే ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్ల నష్టాలు అక్షరాలా రూ.1625.17 కోట్లుగా నమోదయ్యాయి. రాష్ట్ర స్థాయిలో సరాసరి యూనిట్కు రూ.1.04 దాకా నష్టాన్ని డిస్కమ్లు మూటగట్టుకుంటున్నాయి. ఇక ఎస్పీడీసీఎల్లో యూనిట్కు రూ.1.42 కాగా, పంపిణీ, సరఫరా, వాణిజ్య నష్టాలు (ఏటీ అండ్ సీ) 9.92 శాతంగా ఉన్నాయి. ఎన్పీడీసీఎల్లో యూనిట్కు 0.21 పైసలు నష్టం వస్తోంది. ఇక ఏటీ అండ్ సీ నష్టాలు 21.99 శాతంగా ఈ డిస్కమ్లో ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ గత ఆర్నెల్ల (ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు)లో రూ.1517.08 కోట్లు, ఎన్పీడీసీఎల్ ఇదే కాలంలో రూ.108.09 కోట్ల నష్టాలను చవిచూశాయి. రాష్ట్రంలో విద్యుత్ను వినియోగించే గృహ వినియోగదారులు 1.20 కోట్ల మంది ఉండగా.. వ్యవసాయ కనెక్షన్లు 25.62 లక్షలు ఉన్నాయి. అయితే రెండు డిస్కమ్లలో ఎస్పీడీసీఎల్(హైదరాబాద్) వ్యాపారమే అధికం.
2020-21 సంవత్సరంలో కరెంట్ కొనుగోళ్లకు రెండు డిస్కమ్లు రూ.34,813.16 కోట్లు వెచ్చించగా, అందులో ఎస్పీడీసీఎల్ వాటా రూ.23,703.06 కోట్లు, అదే ఎన్పీడీసీఎల్ (వరంగల్) రూ.11,110.10 కోట్లు మాత్రమే. 2020-21లో ఎస్పీడీసీఎల్ పూర్తివ్యయం(ఖర్చులు) రూ.24,144 కోట్లు కాగా.. ఎన్పీడీసీఎల్లో రూ.11,698 కోట్లే. దాంతో వ్యాపారంతో పాటు నష్టాల్లో వాటా ఎస్పీడీసీఎల్లోనే అధికంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక, లెక్కలన్నీ తీశాకే వాస్తవిక నష్టాలు బయటికి రానున్నాయి.