‘సింగరేణి’లో అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి
ABN , First Publish Date - 2021-02-06T06:16:39+05:30 IST
‘సింగరేణి’లో అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలి

కాకతీయఖని, ఫిబ్రవరి 5 : సింగరేణి సంస్థలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేపట్టాలని బీఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) జాతీయ ప్రధానకార్యదర్శి పీ.మాధవనాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన భూపాలపల్లి ఏరియా సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సింగరేణి పరిశ్రమను కాపాడుకునే లక్ష్యంతో బీఎంఎస్ ముందుకు వెళ్తోందని, సింగరేణి సంస్థలో జరిగిన రూ.500 కోట్ల అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టి ఆ నిధులను కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి వినియోగించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమాలు బయటపెట్టేలా దశలవారీగా దేశ వ్యాప్త ఆందోళనలు చేస్తున్నామన్నారు. డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు వందల కోట్లు కాజేశారని అన్నారు. కార్మికుల సంక్షేమానికి ఏడాదికి కేవలం రూ.1 కోటి మాత్రమే ఖర్చు చేస్తూ వందల కోట్ల రూపాయాలను కొల్లగొడుతున్నారని విమర్శలు చేశారు. సింగరేణి కార్మికుల కష్టార్జితంతో వచ్చిన నిధులను కేవలం సింగరేణి ప్రాంతాల్లోనే ఖర్చు చేయాల్సి ఉండగా సిద్ధిపేట, సిరిసిల్ల, ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జి, విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో నాయకులు సాంబయ్య, జనార్ధన్, మనోజ్కుమార్, మల్లారెడ్డి పాల్గొన్నారు.